ములుగు: ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులో భాగంగా నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. సీఎం రాక సందర్భంగా గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, సంప్రదాయ కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు.
వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్లు
అనంతరం స్థానికంగా అర్హులైన వితంతు, ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు.
భక్తుల కోసం తాగునీటి ప్లాంట్ ప్రారంభం
మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సంఘాల సభ్యులతో సీఎం ముఖాముఖి
ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారి ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు
ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ రామచంద్ర నాయక్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Telangana
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం
Quick Summary:
సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం

